నాగార్జునసాగర్
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లాల సరిహద్దులో కృష్ణానదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు. అయితే ఈ పదాన్ని ఆ జలాశయానికి, ఆ మొత్తం ప్రాజెక్టుకు, అక్కడి వూరికి కూడా వర్తింపజేయడం జరుగుతుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రాజెక్టు, పట్టణం, బౌద్ధ చారిత్రక స్థలం
కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar project) అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. ఆంధ్ర ప్రదేశ్ లో నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్ గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడినది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నవి.
నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడాను. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిధిలాలను జలాశయం మధ్యలో "నాగార్జున కొండ" అని ఇప్పుడు పిలువబడే మ్యూజియంలో భద్ర పరచారు. ఆ మ్యూజియంను నాగార్జునకొండ మ్యూజియం అంటారు.
[మార్చు] నాగార్జునసాగర్ ప్రాజెక్టు
[మార్చు] ప్రాజెక్టు చరిత్ర
అప్పటి హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దిగువ కృష్ణ ప్రాజెక్టుగా రూపకల్పన చేసి, నందికొండ వద్ద నిర్మించడానికి ప్రతిపాదించింది. ప్రణాళికా సంఘం కృష్ణా జలాల సమర్ధ వినియోగానికి సంబంధించి పరిశీలించేందుకు ఖోస్లా కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నందికొండ వద్ద కృష్ణా నదిపై డ్యాము నిర్మణాన్ని సూచించింది. ప్రణాళికా సంఘం ఈ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్ధ్యం 281 టి.ఎం.సి. గా సూచించింది.
1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉండటం వలన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.
అప్పటికే బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
[మార్చు] విశేషాలు
సాగునీటి సరఫరా కోసమే కాక, విద్యుదుత్పత్తి కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర బహుళార్థసాధక ప్రాజెక్టు. ప్రధాన డ్యాము రాతి కట్టడము. దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. ఈ మట్టి కట్టలు దేశంలోకే పొడవైనవి. డ్యాముకు రెండువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని జవహర్ కాలువ గాను, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.
[మార్చు] ప్రాజెక్టు గణాంకాలు
డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)
- ప్రధాన రాతి ఆణకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.)
- మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)
- ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)
- కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)
- మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26
- కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
- ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.
[మార్చు] జలాశయ సామర్ధ్యం
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామ్ర్ధ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)
- కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.
[మార్చు] విద్యుదుత్పత్తి సామర్ధ్యం
విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్ధ్యం 960 మె.వా. (మెగా వాట్లు)
- నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,
- కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,
- ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.
ఉత్పత్తి సామర్ధ్యం గల కేంద్రాలు ఉన్నాయి.
[మార్చు] ఆయకట్టు వివరాలు
ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో తయారైన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
| కుడి కాలువ | ||
| జిల్లా | ఆయకట్టు, ఎకరాల్లో | |
|---|---|---|
| గుంటూరు జిల్లా | 6,68,230 | |
| ప్రకాశం జిల్లా | 4,43,180 | |
| మొత్తం | 11,11,410 | |
| ఎడమ కాలువ | ||
| జిల్లా | ఆయకట్టు, ఎకరాల్లో | |
|---|---|---|
| నల్గొండ జిల్లా | 3,72,970 | |
| ఖమ్మం జిల్లా | 3,46,769 | |
| కృష్ణా జిల్లా | 4,04,760 | |
| మొత్తం | 11,24,500 | |
పెద్ద మొత్తం 22,35,910
[మార్చు] ఇటీవలి విశేషాలు
- ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2005 డిసెంబర్ 10 న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వైఎస్ ఆవిష్కరించాడు. గౌతమ బుద్ధుడు, ఆచార్య నాగార్జునుడి విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఇంజినీరింగ్ నిపుణులు కె.ఎల్.రావు, సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీల విగ్రహాలను వైఎస్ ఆవిష్కరించాడు.
|
[మార్చు] నాగార్జునసాగర్ ఊరు
[మార్చు] నాగార్జున కొండ
- ప్రధాన వ్యాసం: నాగార్జునకొండ మ్యూజియం
నాగార్జునసాగర్ నిర్మాణసమయంలో బయల్పడిన క్రి.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ మ్యూజియంలో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. బుద్ద్దునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
[మార్చు] ఇతర దర్శనీయ స్థలాలు
పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. వాగార్జున కొండ మ్యూజియం కూడా తప్పక చూడదగినది.
- సాగరమాత దేవాలయం -
నాగార్జున సాగర్ దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉన్నది. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు.
- దగ్గరి మరికొన్ని స్థలాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
|
|
|
|---|---|
| కృష్ణా నదిపై ప్రాజెక్టులు | * నాగార్జున సాగర్ * తెలుగుగంగ ప్రాజెక్టు * పులిచింతల ప్రాజెక్టు * పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ * ప్రకాశం బ్యారేజి * ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు * బచావత్ ట్రిబ్యునల్ * శ్రీశైలం ప్రాజెక్టు * |
| గోదావరి నదిపై ప్రాజెక్టులు | ధవళేశ్వరం |
|
|
|
|---|---|
| ఉపనదులు | తుంగభద్ర నది · భీమా నది · మూసీ నది · తుంగనది · భద్రనది · మలప్రభ నది · ఘటప్రభ నది |
| ప్రాజెక్టులు | అలమట్టి ప్రాజెక్టు · నారాయణపూర్ ప్రాజెక్టు · ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు · శ్రీశైలం ప్రాజెక్టు · నాగార్జునసాగర్ ప్రాజెక్టు |
| తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు | శ్రీశైలం · ఆలంపూర్ · అమరావతి · మోపిదేవి · శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం |