చిలుకూరు బాలాజీ దేవాలయం
వికీపీడియా నుండి
చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] మందిరం ప్రాముఖ్యత
ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. మ్రొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజిని వీసా బాలాజీ అని పిలుస్తారు. అంతే కాదు తెలంగాణా బాలాజి అని కూడా పిలుస్తారు.
[మార్చు] మందిరం నిర్మాణం, సదుపాయాలు
[మార్చు] స్థల గాధ
ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. ఒకమారు అనారోగ్యకారణంగా ఆయన తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, చింతించవద్దు. నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి, ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్టనుండి శ్రీదేవీభూదేవీ సమేతుడైన శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించి, మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవేంకటేశ్వరుని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.
1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.
[మార్చు] ప్రయాణ సదుపాయాలు
హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు కలవు. అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి.
[మార్చు] దేవాలయం ప్రత్యేకతలు
ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి మరియు ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉన్నది. దీనిని ప్రభుత్వం వారు యాదగిరి గుట్ట దేవాలయానికి అనుసందానం చేయాలనుకొన్నారు. అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రస్టీలు దానిని వ్యతిరేకించారు. దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆలయంలో హుండి లేదు. గుడి నిర్వహణ గుడి బయట కల కొందరు దుకాణదారుల మరియు ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతున్నది. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి అనేది ఇక్కడి పద్దతి. ఈ దేవాలయం మరీ చిన్నగా ఉండి కేవలం లోపల నలుగురైదుగురు మాత్రమే పట్టే వీలు కలిగి ఉంటుంది. కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం ఇప్పుడు ప్రత్యేక బస్సులు నడిపించే పరిస్థితికి చేరుకొన్నది.
[మార్చు] ప్రదక్షిణలు
ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షినలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షినలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు.
[మార్చు] ఇతర విశేషాలు
- దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు. దేవాలయం అర్చకులు "వాక్" అనే ధార్మిక మాసపత్రికను ప్రచురిస్తున్నారు.